రిలయన్స్ జియో ఎప్పుడెప్పుడు ప్రకటిస్తుందా? అని చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియోఫోన్ 5G ఫోన్ గురించి ఈరోజు అంబానీ కొత్త విషయాలను వెల్లడించారు. ఈరోజు జరిగిన RIL AGM 2022 నుండి సంస్థ చైర్మన్ అంబానీ కొత్త ప్రకటనలు చేశారు. రానున్న రెండు నెలల్లో రిలయన్స్ జియో 5G సేవలను ఆరంభిస్తుందని తెలిపారు. అంటే, వచ్చే దీపావళి దేశ ప్రజలకు జియో 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. అయితే, ఈ సర్వీసులు ముందుగా ప్రధాన నగరాలలో మాత్రమే అంధుబాటులోకి వస్తాయి. అంతేకాదు, 5G సర్వీసులను అందించే సమయానికిల్లా 5G ఫోన్ ను కూడా తీసుకొచ్చే పనిలో ఉన్నామని కూడా పేర్కొన్నారు.
అయితే, 5G సర్వీసులు దేశమంతటా పూర్తి స్థాయిలో వచ్చే నాటికీ ఇది సాధ్యమవుతుందని అంబానీ హింట్ ఇచ్చారు. ఈ ఫోన్ యొక్క పేరు లేదా మరే ఇతర వివరాలను కూడా ఈ మీటింగ్ నుండి ప్రకటించలేదు. అయితే, జియో యొక్క ఈ అప్ కమింగ్ 5G ఫోన్ ను గూగుల్ భాగస్వామ్యంతో తీసుకురాబోతున్నట్లు మాత్రం ప్రకటించారు. కానీ, గత కొంత కాలంగా ఆన్లైన్లో వస్తున్న అంచనాలు మరియు రూమర్లు కూడా అప్ కమింగ్ జియోఫోన్ 5G ఫోన్ ఎలా ఉండబోతున్నదనే విషయాన్ని చెబుతున్నాయి. ఆ అంచనా స్పెక్స్ మరియు ఫీచర్లను క్రింద చూడవచ్చు.
Jio 5G Phone: అంచనా స్పెక్స్
నివేదికల ప్రకారం, Jio 5G ఫోన్ 6.5-అంగుళాల డిస్ప్లేని సాధారణ HD రిజల్యూషన్ ప్యానెల్ తో కలిగిఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, అప్ కమింగ్ Jio 5G ఫోన్ 4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ పాటు, Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్ తో రావచ్చని ఊహిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్లో కనీసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000mAh బ్యాటరీని అమర్చవచ్చు.
అలాగే, Jio 5G ఫోన్ USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో పాటుగా 13MP మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ కూడా ఉండవచ్చు. అయితే, ఇవన్నీ కూడా ముందస్తు అంచనా స్పెక్స్ మాత్రమే. జియో అధికారికంగా జియో 5G ఫోన్ ను వెల్లడించినప్పుడు చూడాలి ఫోన్ ఎలా ఉంటుందో.